మే 30, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని కేంద్ర చేనేత, జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ తెలిపారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా కృష్ణా జిల్లా మల్లవల్లి పారిశ్రామికవాడలోని ఓ జౌళి పరిశ్రమను సందర్శించిన ఆయన, పారిశ్రామికవేత్తలతో సమావేశమై జౌళి, పట్టు పరిశ్రమల అభివృద్ధిపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్కు జౌళి రంగంలో అపార అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని చేనేతతో పాటు ఆధునిక జౌళి పరిశ్రమలకు కేంద్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ముఖ్యమంత్రితో సమావేశమై జౌళి రంగ విస్తరణ, పెట్టుబడుల ఆకర్షణ, పత్తి ఉత్పత్తి పెంపు వంటి అంశాలపై చర్చించనున్నట్లు వెల్లడించారు.పత్తి దిగుబడుల పెంపు కోసం ప్రత్యేక ప్రణాళికలు అవసరమని పేర్కొన్న ఆయన, చేనేత రంగ అభివృద్ధికి కొత్త క్లస్టర్ల ఏర్పాటుపై కూడా దృష్టి సారిస్తున్నామని తెలిపారు. గ్లాస్ ఫైబర్, కార్బన్ ఫైబర్, గ్రాఫీన్ వంటి ఆధునిక రంగాల్లో రాష్ట్రానికి విస్తృత అవకాశాలు ఉన్నాయని చెప్పారు.జౌళి రంగ ప్రోత్సాహం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన భారీ ప్రోత్సాహకాలలో ఆంధ్రప్రదేశ్కు ఎక్కువ భాగస్వామ్యం లభించేలా కృషి చేస్తామని గిరిరాజ్ సింగ్ స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని జౌళి పరిశ్రమల ప్రధాన కేంద్రంగా అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
