మే 30, (నేటి తెలుగు పత్రిక): బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ అరెస్టుకు ఆయన చేసిన వ్యాఖ్యలే కారణమని ప్రభుత్వ విప్ బల్మూరి వెంకట్ పేర్కొన్నారు. సింగరేణి అంశంపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో సుమన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గాంధీభవన్లో మీడియాతో మాట్లాడిన బల్మూరి వెంకట్, సుమన్ వ్యాఖ్యల వెనుక మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుట్ర ఉందని ఆరోపించారు.ప్రభుత్వంపై విమర్శలు చేయడం వేరు, ప్రజల భద్రతకు ముప్పు కలిగించే విధంగా మాట్లాడటం వేరని ఆయన అన్నారు. రాజకీయ కోపం ఉంటే ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకోవాలని, కానీ సామాన్య ప్రజలు ప్రయాణించే రైళ్లను లక్ష్యంగా చేసుకోవడం సమంజసం కాదని వ్యాఖ్యానించారు. రైళ్లలో ప్రయాణించే వారు ఎక్కువగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, పేద వర్గాల ప్రజలేనని గుర్తుచేశారు.ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తాము కూడా అనేక నిరసన కార్యక్రమాలు నిర్వహించామని, అయితే అవన్నీ ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే జరిగాయని చెప్పారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించే చర్యలను కాంగ్రెస్ ఎప్పుడూ ప్రోత్సహించలేదన్నారు. బీఆర్ఎస్ నాయకుల వ్యవహారశైలిపై విమర్శలు చేసిన బల్మూరి వెంకట్, తెలంగాణలో శాంతిభద్రతలకు భంగం కలిగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో రాజకీయ ప్రాధాన్యం కోల్పోతున్న బీఆర్ఎస్ ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలను ప్రోత్సహిస్తోందని విమర్శించారు.సుమన్ చేసిన వ్యాఖ్యలను ప్రభుత్వం, పోలీసులు తీవ్రంగా పరిగణించారని, చట్టం తన పని తాను చేసుకుంటోందని ఆయన స్పష్టం చేశారు. ప్రజల భద్రతకు ముప్పు కలిగించే చర్యలపై ఎలాంటి రాజీ ఉండదని, అవసరమైతే కఠిన చట్టాల కింద చర్యలు తీసుకోవాలని కూడా బల్మూరి వెంకట్ అభిప్రాయపడ్డారు.
