మే 31, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సామాజిక భద్రతా పథకాల అమలులో మరో కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ నెల నుంచి కొత్తగా 5,606 మంది అర్హులకు వితంతు పెన్షన్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. లబ్ధిదారులకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా వెంటనే సాయం అందించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.జూన్ నెల పెన్షన్ల పంపిణీ కోసం రాష్ట్రవ్యాప్తంగా 62.34 లక్షల మంది లబ్ధిదారులకు రూ.2,728 కోట్ల నిధులను విడుదల చేశారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు, కళాకారులు, ట్రాన్స్జెండర్లు తదితర వర్గాలు ఈ పథకాల ద్వారా లబ్ధి పొందనున్నాయి.కొత్తగా మంజూరైన వితంతు పెన్షన్ల కోసం అదనంగా రూ.2.24 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. ప్రస్తుతం అమలులో ఉన్న ప్రత్యేక విధానం ప్రకారం, పెన్షన్ పొందుతున్న వ్యక్తి మరణిస్తే వారి జీవిత భాగస్వామి అర్హత కలిగి ఉంటే అదే నెల నుంచి పెన్షన్ బదిలీ చేసే అవకాశం కల్పిస్తున్నారు. దీంతో కొత్త దరఖాస్తులు, దీర్ఘకాల నిరీక్షణ అవసరం లేకుండా కుటుంబాలకు వెంటనే ఆర్థిక భరోసా లభిస్తోంది.రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు స్థాయిలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నెల మొదటి తేదీ నుంచే లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పెన్షన్లు అందజేయనున్నారు. సంక్షేమ పథకాల అమలుకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సహాయం చేరేలా చర్యలు కొనసాగుతున్నాయని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు.
