మే 31, (నేటి తెలుగు పత్రిక): అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా భారీ స్థాయిలో “యోగాంధ్ర-2026” కార్యక్రమాలను నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. జూన్ 7 నుంచి 14 రోజుల పాటు యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహించి, ప్రజల్లో ఆరోగ్యం, యోగాపై అవగాహన పెంచాలని సూచించారు. జూన్ 21న జరిగే ప్రధాన కార్యక్రమంలో భాగంగా అమరావతిలో 25 వేల మందితో రాష్ట్రస్థాయి యోగా నిర్వహించనున్నట్లు సీఎం తెలిపారు. అదే రోజు జిల్లా కేంద్రాల్లో వెయ్యి మందితో ప్రత్యేక యోగా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు.రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు, యువత, మహిళలు, ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థలు పెద్దఎత్తున పాల్గొనేలా ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు సూచించారు. యోగాంధ్ర కార్యక్రమాల ద్వారా మొత్తం కోటి మంది భాగస్వాములు అయ్యేలా కార్యాచరణ సిద్ధం చేయాలని ఆదేశించారు.ఆరోగ్యకర జీవనశైలికి యోగా ఎంతో ఉపయోగకరమని పేర్కొన్న సీఎం, ప్రతి కుటుంబానికి యోగాను చేరువ చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
