హైదరాబాద్,మే 31, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు జూన్ నెల నుంచి పెరిగిన వేతనాలు అమల్లోకి రానున్నాయి. ప్రభుత్వం ప్రకటించిన 11 శాతం ఫిట్మెంట్ ప్రకారం ఉద్యోగులకు జులై 1న అందే వేతనాల్లో పెంపు ప్రతిఫలించనుంది. వేతన సవరణతో ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులకు ఆర్థికంగా ఊరట లభించనుండగా, ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం ప్రక్రియ మాత్రం మరికొంత కాలం ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. విలీనానికి ముందు కార్మిక సంఘాల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.ఎన్నికలు పూర్తైన అనంతరం అధికారులు, గుర్తింపు పొందిన కార్మిక సంఘాల ప్రతినిధులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి విలీన అంశంపై సమగ్ర అధ్యయనం చేపట్టనున్నారు. ఎన్నికల ప్రక్రియ, తదుపరి సంప్రదింపులు పూర్తయ్యేందుకు మరో రెండు నెలల వరకు సమయం పట్టే అవకాశం ఉందని సమాచారం.ఈ నేపథ్యంలో ఆర్టీసీ విలీనం తక్షణం జరిగే అవకాశాలు కనిపించకపోయినా, జీతాల పెంపు మాత్రం నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం అమలవుతుందని ప్రభుత్వం కార్మిక సంఘాలకు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఉద్యోగులు పెరిగిన వేతనాల కోసం ఎదురుచూస్తున్నారు.
