హైదరాబాద్, మే 31, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు మరియు వారి కుటుంబ సభ్యులకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొస్తున్న ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ (ఈహెచ్ఎస్) అమలుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.ఈ పథకాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్న ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్ ద్వారా అమలు చేయనున్నారు. ట్రస్ట్లో ఉద్యోగ సంఘాల నుంచి ఆరుగురు, పెన్షనర్ల సంఘాల నుంచి ఇద్దరు ప్రతినిధులకు స్థానం కల్పిస్తూ భాగస్వామ్య విధానాన్ని ప్రభుత్వం అవలంబిస్తోంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగినే ట్రస్ట్ సీఈవోగా నియమించనున్నట్లు అధికారులు వెల్లడించారు.పథకం అమలుకు అవసరమైన సమాచార సేకరణ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యుల పూర్తి వివరాలను నమోదు చేయాలని ఆర్థిక శాఖ అన్ని ప్రభుత్వ శాఖలకు ఆదేశాలు జారీ చేసింది. మే 31లోగా సమాచారాన్ని ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని స్పష్టం చేసింది.సేకరించిన వివరాల ఆధారంగా ప్రతి లబ్ధిదారుడికి డిజిటల్ హెల్త్ కార్డు జారీ చేయనున్నారు. ఈ కార్డుల ద్వారా ఎంపిక చేసిన ఆసుపత్రుల్లో క్యాష్లెస్ వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఉద్యోగులు, పెన్షనర్లపై వైద్య ఖర్చుల భారం తగ్గించడంతో పాటు అత్యవసర పరిస్థితుల్లో వేగవంతమైన చికిత్స అందించడమే ఈ పథకం ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం పేర్కొంది.ఆరోగ్య భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం చేపడుతున్న ఈ చర్య ఉద్యోగులు, పెన్షనర్లకు గణనీయమైన ఉపశమనం కలిగించనుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
