Breaking News

తెలంగాణ అస్తిత్వంపై దాడి చేస్తే సహించం: కల్వకుంట్ల కవిత హెచ్చరిక

హైదరాబాద్, జూన్ 01, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలు–సాధన అంశంపై తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ అస్తిత్వం, హక్కులు, స్వాభిమానాన్ని దెబ్బతీసే ప్రయత్నాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని ఆమె స్పష్టం చేశారు.

తెలంగాణ ఉద్యమం అనేక మంది అమరవీరుల త్యాగాల ఫలితమని పేర్కొన్న కవిత, వారి కుటుంబాలకు ఇప్పటికీ పూర్తి స్థాయిలో న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యమ సమయంలో తెలంగాణ ప్రజలు శాంతియుతంగా పోరాడి రాష్ట్రాన్ని సాధించుకున్నారని గుర్తుచేశారు.

తెలంగాణపై ఇటీవల కొందరు ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా తప్పుబట్టారు. తెలంగాణ అనే పదం, రాష్ట్ర అస్తిత్వం, సంస్కృతిని ప్రశ్నించే వ్యాఖ్యలు ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నాయని అన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో బయటి జోక్యాన్ని తెలంగాణ ప్రజలు అంగీకరించరని స్పష్టం చేశారు.

ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై మళ్లీ ఆంక్షలు

తెలంగాణలో సభలు నిర్వహిస్తూ రాష్ట్ర భవిష్యత్తుపై వ్యాఖ్యానించే ముందు ఆయా నేతలు తమ రాష్ట్ర సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని కవిత సూచించారు. తెలంగాణ ప్రజలు స్వయంగా తమ భవిష్యత్తును నిర్ణయించుకునే సామర్థ్యం కలిగి ఉన్నారని పేర్కొన్నారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడిచినా ఉద్యమకారులకు ఇచ్చిన హామీల అమలులో పురోగతి కనిపించడం లేదని ఆమె విమర్శించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉద్యమకారుల సంక్షేమానికి సంబంధించిన హామీల అమలుపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.

తెలంగాణ హక్కుల పరిరక్షణ, రైతుల సంక్షేమం, యువతకు ఉపాధి అవకాశాలు, సామాజిక న్యాయం వంటి అంశాలే తమ పార్టీ ప్రధాన అజెండా అని కవిత తెలిపారు. భవిష్యత్ తెలంగాణ నిర్మాణానికి ప్రజల సూచనలు, సలహాలు స్వాగతిస్తున్నామని చెప్పారు.

ఫోన్ ట్యాపింగ్ కేసు: సిట్ విచారణకు హాజరైన ఇద్దరు ఎమ్మెల్యేలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *