జూన్ 02, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత, జులై 2న ఉప్పల్ భగాయత్లో భారీ భూపోరాటం నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ ఉద్యమంలో అన్ని వర్గాల ప్రజలు, ఉద్యమకారులు, విద్యార్థులు, ఉద్యోగులు, మేధావులు పాల్గొనాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ ఉద్యమానికి సిద్ధాంతకర్తగా నిలిచిన ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఆగస్టు 6లోపు ట్యాంక్బండ్పై విగ్రహం ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అవసరమైతే విగ్రహ నిర్మాణం, నిర్వహణ ఖర్చులను తామే భరిస్తామని తెలిపారు.
తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయకపోవడం నిరాశ కలిగించిందని కవిత విమర్శించారు. ఉద్యమకారుల సంక్షేమం, అమరవీరుల కుటుంబాలకు న్యాయం చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగాలు చేసిన అమరవీరులను స్మరించుకున్న ఆమె, ఉద్యమ చరిత్రను భావితరాలకు చేరవేయాల్సిన అవసరం ఉందన్నారు. జూన్ 2ను కూడా స్వాతంత్ర్య దినోత్సవం తరహాలో ఘనంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని, వారికి తగిన గౌరవం కల్పించడం తమ బాధ్యత అని కవిత పేర్కొన్నారు.
