హైదరాబాద్, మార్చి 30, నేటి తెలుగు పత్రిక: జీవో నం.317 వల్ల ఇబ్బందులు పడుతున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులకు వెంటనే న్యాయం చేయాలని కోరుతూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు.2021లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం జారీ చేసిన జీవో 317 కారణంగా వేలాది మంది ఉద్యోగులు తమ స్వస్థలాలకు దూరంగా పనిచేస్తూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆమె పేర్కొన్నారు. ఈ అంశంపై అప్పట్లో పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి కూడా జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేసిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు.2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల్లో భాగంగా జీవో 317ను సమీక్షించి బాధితులకు న్యాయం చేస్తామని చెప్పిన విషయాన్ని కవిత ప్రస్తావించారు. ఎన్నికల హామీ మేరకు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.జీవో 317 బాధితులకు వన్టైమ్ రిలీఫ్ కింద స్థానికత ఆధారంగా స్వస్థలాలకు బదిలీలు కల్పించాలని, స్థానికత నిర్ధారణ నిబంధనల్లో కూడా మార్పులు చేయాలని డిమాండ్ చేశారు.ఉద్యోగుల సమస్యలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కవిత విజ్ఞప్తి చేశారు.



