హైదరాబాద్, మార్చి 30, నేటి తెలుగు పత్రిక: పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ సరఫరాపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీకి వివరించారు. ప్రధానమంత్రి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న సీఎం, రాష్ట్రంలో ఇంధన సరఫరా పరిస్థితులను సమగ్రంగా వివరించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేసి పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో గ్యాస్, పెట్రోల్, డీజిల్ సరఫరాపై ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసి నోడల్ అధికారులను నియమించినట్లు చెప్పారు. ఆసుపత్రులు, పాఠశాలలు, వృద్ధాశ్రమాలకు ప్రాధాన్యతగా గ్యాస్ సరఫరా చేస్తున్నట్లు వివరించారు.
ప్రస్తుతం రాష్ట్రంలో సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయని, సాధారణ అవసరాలకు ఎలాంటి అంతరాయం లేదని సీఎం స్పష్టం చేశారు. ఇంధన కొరతపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.ఇక భవిష్యత్తులో శిలాజ ఇంధనాలపై ఆధారాన్ని తగ్గిస్తూ ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నట్లు సీఎం వెల్లడించారు. వీలపై పన్ను మినహాయింపులు, తయారీ రంగానికి ప్రోత్సాహం అందిస్తున్నట్లు చెప్పారు.హైదరాబాద్లో డీజిల్ ఆటోలను ఈవీలుగా మార్పిడి చేసే ప్రక్రియను ప్రారంభిస్తున్నామని, ఆర్టీసీలో కూడా ఈవీ బస్సులను ప్రవేశపెట్టనున్నట్లు సీఎం పేర్కొన్నారు.



