హైదరాబాద్, మార్చి 30, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్లోని రవీంద్రభారతిలో శాసనసభ బడ్జెట్ సమావేశాల సందర్భంగా నిర్వహించిన ప్రజాప్రతినిధుల సాంస్కృతిక వేడుకలను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.ప్రజాప్రతినిధులు క్రీడలు, సాంస్కృతిక ప్రదర్శనలు ఇవ్వడం విద్యార్థులకు స్ఫూర్తిదాయకమని సీఎం పేర్కొన్నారు. విద్యార్థి దశలో ఉన్న ప్రతిభను జీవితంలో ముందుకు సాగుతున్న కొద్దీ చాలామంది మరిచిపోతారని, అలాంటి నైపుణ్యాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు.విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడానికి ప్రభుత్వం గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు సీఎం కప్ పోటీలు నిర్వహిస్తోందని తెలిపారు. చదువుతో పాటు క్రీడలు, కళల్లో రాణించినా మంచి భవిష్యత్తు సాధ్యమేనని సూచించారు.
తెలంగాణ ఏర్పడిన తర్వాత నిలిచిపోయిన సాంస్కృతిక సంప్రదాయాలను మళ్లీ పునరుద్ధరించామని సీఎం వెల్లడించారు. రాజకీయాలకు అతీతంగా అందరూ ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరారు.రెండు రోజుల పాటు జరిగిన ఈ స్పోర్ట్స్, కల్చరల్ మీట్లో విజేతలకు ముఖ్యమంత్రి చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. వివిధ సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకోగా, పాల్గొన్న ప్రజాప్రతినిధులను సీఎం ప్రత్యేకంగా అభినందించారు.












