మార్చి 30, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్లో ప్రతిపాదిత ‘తెలంగాణ హేట్ స్పీచ్ అండ్ హేట్ క్రైమ్స్ (ప్రివెన్షన్) బిల్లు’పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ బిల్లు ప్రజాస్వామ్య హక్కులను అణచివేసే ప్రమాదకర సాధనమని ఆయన పేర్కొన్నారు.ప్రభుత్వం విమర్శకుల గొంతుకలను నొక్కివేయడానికే ఈ చట్టాన్ని తీసుకువస్తోందని కేటీఆర్ ఆరోపించారు. భావప్రకటన స్వేచ్ఛకు ఇది ముప్పుగా మారుతుందని, రాజ్యాంగ హక్కులను హరించేలా నిబంధనలు ఉన్నాయని అన్నారు.బిల్లులోని పదజాలం అస్పష్టంగా ఉండటం వల్ల దుర్వినియోగానికి అవకాశం ఉందని ఆయన విమర్శించారు. ‘సామాజిక సమగ్రతకు భంగం’, ‘వ్యతిరేక భావాలు’ వంటి పదాలకు స్పష్టత లేకపోవడం ఆందోళనకరమని చెప్పారు. దీనివల్ల ప్రతిపక్ష నేతలు, జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలను లక్ష్యంగా చేసుకునే ప్రమాదం ఉందన్నారు.
అలాగే, సుప్రీంకోర్టు ‘శ్రేయా సింఘల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా’ తీర్పును గుర్తుచేస్తూ, కేవలం హింసకు ప్రేరేపించే వ్యాఖ్యలపైనే చర్యలు తీసుకోవాలని కోర్టు పేర్కొన్న విషయాన్ని తెలిపారు. విమర్శలు లేదా వ్యంగ్యాన్ని శిక్షార్హంగా పరిగణించడం రాజ్యాంగ విరుద్ధమని అన్నారు.ఈ బిల్లులో ప్రతిపాదించిన 7 నుంచి 10 ఏళ్ల జైలు శిక్షలు ప్రజల్లో భయాన్ని కలిగిస్తాయని కేటీఆర్ పేర్కొన్నారు. ఇప్పటికే హేట్ స్పీచ్పై చట్టాలు ఉన్న నేపథ్యంలో కొత్త చట్టం అవసరమేంటని ప్రశ్నించారు.ప్రభుత్వం వెంటనే ఈ బిల్లును పునర్విమర్శించాలని, ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
