మార్చి 30, నేటి తెలుగు పత్రిక: రాష్ట్రంలో ఆహార కల్తీపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించనుందని సీఎం ఏ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈగల్, హైడ్రా మోడల్లోనే ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసి కల్తీపై నియంత్రణ తీసుకురానున్నట్లు వెల్లడించారు.దేశవ్యాప్తంగా అమల్లో ఉన్న చట్టాలను పరిశీలించి మరింత బలమైన చర్యలు చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందని తెలిపారు. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు.ఇదిలా ఉండగా, రాష్ట్రంలో అమలవుతున్న సన్నబియ్యం పథకం ఏడాది పూర్తయిన సందర్భంగా శాసనసభలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ప్రజాప్రతినిధులకు సన్నబియ్యంతో భోజనం ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
సీఎం మాట్లాడుతూ, గతంలో రేషన్ దుకాణాల ద్వారా అందించిన బియ్యం వినియోగంలో సమస్యలు ఉండటంతో సన్నబియ్యం పథకాన్ని ప్రవేశపెట్టినట్లు తెలిపారు. పేదలకు నాణ్యమైన ఆహారం అందించడమే లక్ష్యమని పేర్కొన్నారు.రైతులకు ప్రోత్సాహంగా క్వింటాలుకు బోనస్ ప్రకటించి సన్నవడ్ల సాగును పెంచుతున్నామని చెప్పారు. అలాగే, ప్రతి అర్హుడికి రేషన్ కార్డు అందించడంపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు.విద్య, పోషకాహారం, వ్యవసాయ రంగాల్లో సమగ్ర అభివృద్ధి కోసం చర్యలు కొనసాగుతాయని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.





