మార్చి 31, నేటి తెలుగు పత్రిక: పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితులపై తెలంగాణ అసెంబ్లీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సభలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు.ఇరాన్–ఇజ్రాయిల్ మధ్య ప్రారంభమైన ఘర్షణలు విస్తరిస్తూ ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని భట్టి విక్రమార్క తెలిపారు. ముఖ్యంగా క్రూడ్ ఆయిల్ సరఫరా దెబ్బతినడం వల్ల పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరిగే ప్రమాదం ఉందని అన్నారు.ఈ యుద్ధం కారణంగా మానవ నష్టం పెరుగుతుండటంతో పాటు, వేలాది నిరపరాధులు ప్రాణాలు కోల్పోతున్నారని సభలో ఆవేదన వ్యక్తమైంది. ఆధునిక ఆయుధాలతో జరుగుతున్న దాడులు పరిస్థితిని మరింత ప్రమాదకరంగా మారుస్తున్నాయని పేర్కొన్నారు.ఆర్థిక ప్రభావం ప్రపంచ దేశాలపై, ముఖ్యంగా ఆసియా దేశాలపై తీవ్రంగా పడుతున్నదని, భారతదేశంపైనా దాని ప్రభావం స్పష్టంగా కనిపిస్తోందని తెలిపారు.ఈ పరిస్థితుల్లో యుద్ధాన్ని తక్షణం ఆపేందుకు భారత ప్రభుత్వం చొరవ తీసుకుని ప్రపంచ శాంతి స్థాపనకు కృషి చేయాలని అసెంబ్లీ తీర్మానంలో కోరింది. యుద్ధం కొనసాగితే మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే ప్రమాదం ఉందని సభ్యులు హెచ్చరించారు.
ప్రపంచ మానవాళి భద్రత దృష్ట్యా తక్షణ చర్యలు అవసరమని సభ స్పష్టం చేసింది.
