మార్చి 31, నేటి తెలుగు పత్రిక: దేశంలో నక్సలిజం నిర్మూలనపై కేంద్ర ప్రభుత్వం మరింత కఠిన వైఖరి అవలంబిస్తున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. లోక్సభలో మాట్లాడుతూ మావోయిస్టులకు తుదిచెతవని హెచ్చరిక జారీ చేశారు.ఆయుధాలు వీడి లొంగిపోని మావోయిస్టులపై కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే పూర్తిగా అంతమొందిస్తామని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలతో నక్సలిజం ప్రభావం గణనీయంగా తగ్గిందని తెలిపారు.ప్రత్యేకంగా ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో మావోయిస్టుల ప్రభావం తగ్గుముఖం పట్టిందని చెప్పారు. బస్తర్ ప్రాంతం ఇప్పుడు దాదాపు నక్సల్స్ రహితంగా మారిందని వెల్లడించారు.గత కొన్నేళ్లుగా పెద్ద సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోతున్నారని, ప్రభుత్వ విధానాలు, అభివృద్ధి కార్యక్రమాల వల్ల హింస తగ్గిందని పేర్కొన్నారు. రహదారులు, పాఠశాలలు, ఆసుపత్రులు వంటి మౌలిక వసతుల అభివృద్ధి ద్వారా ప్రభావిత ప్రాంతాల్లో మార్పు తీసుకొస్తున్నామని తెలిపారు.నక్సలిజం పెరగడానికి గత ప్రభుత్వాల వైఖరే కారణమని విమర్శించిన ఆయన, మావోయిస్టు హింసలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు కేంద్రం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.దేశాన్ని పూర్తిగా నక్సల్స్ రహితంగా మార్చడం కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని అమిత్ షా స్పష్టం చేశారు.
