మే 15, (నేటి తెలుగు పత్రిక): దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. అర్హులైన లబ్ధిదారులకు ప్రత్యేక పింఛన్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.తొలి విడతలో 965 మంది లబ్ధిదారులకు జూన్ 1 నుంచి నెలకు రూ.10,000 చొప్పున పింఛన్ అందించనున్నట్లు అధికారులు తెలిపారు. కిడ్నీ, లివర్, గుండె సంబంధిత వ్యాధులతో పాటు బోదకాలు, కుష్టు వంటి తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ పథకం వర్తించనుంది.గత ఏడాది నుంచి స్వీకరించిన దరఖాస్తులను పరిశీలించిన అనంతరం ప్రభుత్వం వాటిని ఆమోదించింది. ఈ పథకం కోసం ప్రతి నెల సుమారు రూ.93 లక్షలకు పైగా వ్యయం చేయనున్నట్లు అంచనా వేయబడింది. పింఛన్ పంపిణీని మరింత సులభతరం చేయడానికి గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా లబ్ధిదారుల ఇళ్ల వద్దకే డబ్బులు అందించనున్నారు. తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న వారు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఈ విధానం అమలు చేయనున్నారు.భవిష్యత్తులో మరిన్ని దరఖాస్తులను వేగంగా పరిశీలించి అదే నెలలో పింఛన్ మంజూరు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న కుటుంబాలకు ఈ పథకం ఆర్థిక భరోసా కల్పించనుంది.
