Breaking News

నల్లమలలో చరిత్ర జాడల అన్వేషణకు గ్రీన్ సిగ్నల్.. ఏఎస్ఐ సర్వేకు పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు

మే 31, (నేటి తెలుగు పత్రిక): నల్లమల అటవీ ప్రాంతంలో దాగి ఉన్న చారిత్రక, సాంస్కృతిక వారసత్వ సంపదను వెలికితీసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత పురావస్తు సర్వేక్షణ సంస్థ (ఏఎస్ఐ) చేపట్టనున్న ప్రత్యేక సర్వేకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేయగా, ఉప ముఖ్యమంత్రి మరియు అటవీ, పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఈ చర్యను స్వాగతిస్తూ ఏఎస్ఐ బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.అడవులు కేవలం జీవ వైవిధ్యానికి మాత్రమే కాకుండా చారిత్రక కట్టడాలు, పురావస్తు అవశేషాలు, సాంస్కృతిక వారసత్వ సంపదకు కూడా నిలయాలని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఇలాంటి అమూల్యమైన సంపదను గుర్తించి సంరక్షించడం ద్వారా మన చరిత్ర, సంస్కృతిని భావితరాలకు అందించే అవకాశం ఉంటుందని చెప్పారు. ప్రకృతి సంపదతో పాటు చారిత్రక వారసత్వాన్ని కాపాడటం కూడా ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు.గతంలో వైఎస్సార్ కడప జిల్లా లంకమల అటవీ ప్రాంతంలో నిర్వహించిన పురావస్తు సర్వేలో అనేక కీలక ఆధారాలు వెలుగులోకి వచ్చాయని అధికారులు గుర్తు చేశారు. క్రీస్తుపూర్వం తొలి శతాబ్దం నుంచి క్రీస్తుశకం 16వ శతాబ్దం వరకు చెందిన సుమారు 30 శాసనాలు గుర్తించబడగా, 10 వేల సంవత్సరాల నాటి గుహ చిత్రాలు కూడా బయటపడ్డాయి. ఈ అవశేషాలు శాతవాహనుల కాలం, బౌద్ధ, శైవ సంప్రదాయాలు, ప్రాచీన యాత్రా మార్గాలు, ఆది మానవుల జీవన విధానాలపై విలువైన సమాచారాన్ని అందించాయి.ఇప్పుడు నల్లమలలో చేపట్టనున్న తాజా సర్వే ద్వారా తెలుగు, దేవనాగరి లిపుల్లో చెక్కబడిన శాసనాలు, పురాతన కట్టడాలు, చారిత్రక ఆనవాళ్లను గుర్తించే ప్రయత్నం చేయనున్నారు. ఈ అధ్యయనం ద్వారా ప్రాచీన రాజ్యాల చరిత్ర, దక్షిణ భారత సంస్కృతి, సంప్రదాయాలపై మరింత లోతైన అవగాహన లభించే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, వన్యప్రాణుల సంరక్షణకు ఎలాంటి భంగం కలగకుండా అటవీ శాఖ అధికారులు ఏఎస్ఐ బృందానికి అవసరమైన సహకారం అందించాలని సూచించారు. ప్రకృతి సంపదను కాపాడుతూనే చారిత్రక వారసత్వాన్ని సంరక్షించడం ద్వారా పర్యాటక రంగానికి కూడా కొత్త అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు.నల్లమల అటవీ ప్రాంతంలో దాగి ఉన్న చరిత్రను వెలికితీసే ఈ సర్వే విజయవంతమైతే, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కొత్త అధ్యాయాలు వెలుగులోకి వచ్చే అవకాశముందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది. అలాగే ఎకో టూరిజం, హెరిటేజ్ టూరిజం అభివృద్ధికి కూడా ఇది దోహదపడుతుందని అధికారులు పేర్కొన్నారు.

డీఎస్సీ నియామకాలు పారదర్శకంగా జరిగాయి: విద్యాశాఖ కార్యదర్శి

అమరావతిలో మధ్యతరగతి, పేదలకు గృహ సముదాయాలు.. సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *