Breaking News

పట్టణ పేదలకు ఇందిరమ్మ ఇళ్ల వరం.. లక్ష గృహాల నిర్మాణానికి త్వరలో శ్రీకారం: మంత్రి పొంగులేటి

మే 31, (నేటి తెలుగు పత్రిక): పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న నిరుపేద కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. జీవనోపాధికి ఇబ్బంది కలగకుండా ప్రజలు ప్రస్తుతం నివసిస్తున్న ప్రాంతాల పరిధిలోనే అత్యాధునిక సౌకర్యాలతో ఇందిరమ్మ ఇళ్లను నిర్మించి అందిస్తామని ఆయన స్పష్టం చేశారు. హైదరాబాద్ నగర పరిధిలో తొలి విడతగా మంజూరైన లక్ష ఇళ్ల నిర్మాణానికి త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన జరగనుందని వెల్లడించారు.బంజారాహిల్స్‌లో నిర్మించనున్న సమీకృత సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల సముదాయానికి శంకుస్థాపన చేసిన అనంతరం జరిగిన సభలో మంత్రి మాట్లాడారు. గత ప్రభుత్వాల మాదిరిగా పేదలను నగరాలకు దూరంగా తరలించి ఇళ్లు కేటాయించే విధానాన్ని అనుసరించబోమన్నారు. ప్రతి నియోజకవర్గాన్ని ఒక ప్రత్యేక యూనిట్‌గా పరిగణించి, ఆ నియోజకవర్గ ప్రజలకు అదే ప్రాంతంలో గృహాలు నిర్మించి అందజేస్తామని తెలిపారు. ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టణ పేదలకు అందిస్తున్న ప్రత్యేక కానుక అని పేర్కొన్నారు.పేద ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు వారి గుమ్మం వద్దకే చేరేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి చెప్పారు. అందులో భాగంగానే స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, సర్వే తదితర శాఖల సేవలను ఒకే చోట అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సమీకృత కార్యాలయ భవనాల నిర్మాణం చేపడుతున్నామని వివరించారు. ప్రభుత్వ సేవలను మరింత పారదర్శకంగా, సులభతరంగా అందించడమే లక్ష్యమన్నారు.రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పరిపాలనా సంస్కరణల్లో భాగంగా మూడు కార్పొరేషన్ల పరిధిలోని 13 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలను కార్పొరేట్ స్థాయి మౌలిక వసతులతో అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు ప్రైవేటు సంస్థలకు ఏమాత్రం తీసిపోని సేవలను ప్రభుత్వ కార్యాలయాల్లోనే అందించే విధంగా ప్రణాళికలు అమలు చేస్తున్నామని చెప్పారు.ప్రభుత్వంపై అదనపు ఆర్థిక భారం పడకుండా పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్య విధానంలో ఈ భవనాల నిర్మాణం చేపడుతున్నామని మంత్రి వెల్లడించారు. నిర్మాణ రంగంలో అనుభవం కలిగిన సంస్థలకు బాధ్యతలు అప్పగించడం ద్వారా నాణ్యతతో కూడిన పనులు వేగంగా పూర్తవుతాయని అన్నారు. బంజారాహిల్స్‌లో నిర్మించనున్న సమీకృత భవనాన్ని కొద్ది నెలల్లో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు.ఈ భవన సముదాయంలో ఎస్.ఆర్.నగర్, బంజారాహిల్స్, గోల్కొండ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలతో పాటు డీఐజీ కార్యాలయం, చిట్స్ రిజిస్ట్రార్ కార్యాలయం వంటి కీలక విభాగాలు ఒకేచోట పనిచేయనున్నాయని చెప్పారు. దీంతో ప్రజలకు సేవలు సులభంగా అందడంతో పాటు స్థానికంగా ఉద్యోగ, వ్యాపార అవకాశాలు కూడా పెరుగుతాయని పేర్కొన్నారు.అలాగే బంజారాహిల్స్ ప్రాంతంలో వందల ఏళ్లుగా ప్రార్థనలు నిర్వహిస్తున్న ముస్లిం సోదరుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని, ప్రతి ఏడాది రెండు సార్లు నమాజ్ కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి వెల్లడించారు.పట్టణ పేదలకు గృహ వసతి, ప్రజలకు మెరుగైన పరిపాలనా సేవలు, ఆధునిక మౌలిక సదుపాయాల కల్పన అనే మూడు ప్రధాన లక్ష్యాలతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. త్వరలో ప్రారంభం కానున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ కార్యక్రమం ద్వారా వేలాది కుటుంబాల సొంతింటి కల నెరవేరనుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

తుమ్మిడిహెట్టి అంశంపై మహారాష్ట్ర సీఎం అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదు: సీఎం రేవంత్

ఉచిత విద్యుత్‌పై బీఆర్ఎస్‌కు సీఎం రేవంత్ సవాల్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *