అమరావతి, మే 31, (నేటి తెలుగు పత్రిక): మత మార్పిడి జరిగినప్పటికీ దళితుల సామాజిక, ఆర్థిక వెనుకబాటుతనం అంతరించిపోదని పేర్కొంటూ దళిత క్రైస్తవులను ఎస్సీ జాబితాలో కొనసాగించాలని వైసీపీ ఎంపీలు డిమాండ్ చేశారు. ఈ అంశంపై పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ ఎంపీల బృందం ఢిల్లీలో జస్టిస్ కేజీ బాలకృష్ణన్ను కలిసి వినతిపత్రం సమర్పించింది.దళితులు ఏ మతాన్ని స్వీకరించినా వారు ఎదుర్కొనే కుల వివక్ష, సామాజిక అసమానతలు కొనసాగుతూనే ఉంటాయని వైసీపీ నేతలు పేర్కొన్నారు. అందువల్ల మత ప్రాతిపదికన ఎస్సీ హోదాను తొలగించడం సామాజిక న్యాయ స్ఫూర్తికి విరుద్ధమని అభిప్రాయపడ్డారు.దళిత క్రైస్తవులకు రాజ్యాంగబద్ధ హక్కులు, రిజర్వేషన్లు కొనసాగించేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు కోరారు. దళితుల సంక్షేమం, సామాజిక న్యాయం కోసం ఈ అంశంపై పోరాటం కొనసాగిస్తామని వైసీపీ స్పష్టం చేసింది.
