హైదరాబాద్, మే 31, (నేటి తెలుగు పత్రిక): రైతుల పేరుతో బీఆర్ఎస్ రాజకీయాలు చేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. మీడియా చిట్చాట్లో మాట్లాడిన ఆయన, రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా కొనసాగించేందుకు ప్రత్యేక రైతు డిస్కమ్ ఏర్పాటు చేసే ప్రయత్నాలను బీఆర్ఎస్ తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపించారు.రైతుల మోటార్లకు మీటర్లు పెట్టబోతున్నారంటూ అపోహలు సృష్టిస్తున్నారని మండిపడ్డ సీఎం, ఉచిత విద్యుత్ విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గదని స్పష్టం చేశారు. “రైతుల మోటార్లకు మీటర్లు పెట్టినా, ఉచిత కరెంట్ను నిలిపివేసినా మేము ఎన్నికల్లో పోటీ చేయం. కానీ మీటర్లు పెట్టకపోయినా, ఉచిత విద్యుత్ కొనసాగించినా బీఆర్ఎస్ ఎన్నికల బరిలో నుంచి తప్పుకుంటుందా?” అంటూ ప్రశ్నించారు.రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్న ఆయన, ప్రజల్లో అనవసర భయాందోళనలు సృష్టించడం మానుకోవాలని బీఆర్ఎస్ నాయకత్వానికి సూచించారు. రైతుల ప్రయోజనాలను కాపాడే విషయంలో ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
