హైదరాబాద్, మే 31, (నేటి తెలుగు పత్రిక): అంతర్రాష్ట్ర జల వివాదాల పరిష్కారానికి చర్చలే మార్గమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచిస్తున్నప్పటికీ, తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు అంశంపై చర్చించేందుకు దేవేంద్ర ఫడ్నవీస్ అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.మీడియా చిట్చాట్లో మాట్లాడిన సీఎం రేవంత్, పోలవరం ప్రాజెక్టు కోసం ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్కు బదిలీ చేసిన కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ జల అవసరాల విషయంలో కూడా సహకరించాలని కోరారు. రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశాల్లో కేంద్రం సానుకూలంగా స్పందించాలని అన్నారు.పంటల కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)ను కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తున్నప్పటికీ, రైతుల నుంచి పూర్తి స్థాయిలో కొనుగోళ్లు జరపడం లేదని ఆయన విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యాన్ని కేంద్రం కూడా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.రైతుల ప్రయోజనాల విషయంలో రాజీ పడబోమని పేర్కొన్న సీఎం, కేంద్రం స్పందించకపోతే బీజేపీ నాయకుల ఇళ్ల వద్ద నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. రైతుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం అన్ని స్థాయిల్లో పోరాడుతుందని ఆయన స్పష్టం చేశారు.
