గత ప్రభుత్వ అవకతవకలు బయటపడుతున్నాయి: సజ్జల అక్రమాలపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశాలు
అమరావతి: గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తుండటంతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పత్రిపక్ష నేతల విమర్శలను పట్టించుకోకుండా అధికార మత్తులో ఉన్న వారు ఇప్పుడు ఆ అక్రమాలపై దోషులు తగిన శిక్షను ఎదుర్కొంటారనే పరిస్థితి నెలకొంది.
తాజాగా మాజీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కు సంబంధించిన అటవీ భూముల ఆక్రమణ కేసు వెలుగు చూసింది. ఈ అంశంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందిస్తూ సమగ్ర విచారణకు ఆదేశాలు జారీ చేశారు.
అటవీ భూముల ఆక్రమణ ఆరోపణలు
కడప జిల్లా సీకే దిన్నె రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్లు 1599, 1600/1, 2, 1601/1, 12, 255 తో పాటు మరికొన్ని భూములు సజ్జల కుటుంబ సభ్యుల ఆధీనంలో ఉన్నాయని తెలుస్తోంది. అయితే, వీటిలో 42 ఎకరాల అటవీ భూములను సజ్జల ఫ్యామిలీ అక్రమంగా ఆక్రమించిందని ఆరోపణలు వెల్లువెత్తాయి.
డిప్యూటీ సీఎం ఆదేశాలు
ఈ ఆరోపణలపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కడప జిల్లా కలెక్టరుతో సమీక్ష నిర్వహించారు.
- ఆ భూములపై ఎవరి ఆధిపత్యం ఉంది?
- అక్కడ వన్యప్రాణులకు ఎలాంటి హానీ జరిగింది?
- అటవీ భూముల పరిరక్షణకు తగిన చర్యలు తీసుకోవడం జరిగిందా?
ఈ అంశాలపై సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని పవన్ కల్యాణ్ ఆదేశించారు.
అటవీ భూముల పరిరక్షణపై స్పష్టత
అటవీ భూముల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని, అక్రమంగా ఆక్రమణలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టరుకు పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.
ప్రభుత్వ అవినీతిపై దృష్టి
గత ప్రభుత్వ హయాంలో కింద స్థాయి కార్యకర్తల నుంచి నెంబర్ 2 స్థాయికి చేరుకున్నవారితో పాటు చాలా మంది అవినీతికి పాల్పడ్డారని పవన్ కల్యాణ్ ఆరోపించారు.
“ఇలాంటి అక్రమాలపై ఏ మాత్రం రాజీ పడేది లేదు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా ప్రతి ఆరోపణకు విచారణ జరిపి నిజాలను వెలుగులోకి తీసుకురాగలమని” ఆయన చెప్పారు.
ఇప్పటివరకు వెలుగులోకి వచ్చిన వివరాల ఆధారంగా మరింత కఠిన చర్యలు తీసుకోనున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
