ఏప్రిల్ 28, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్, డీజిల్ కొరతపై వైసీపీ నేత సజ్జల రామకృష్ణా రెడ్డి ప్రభుత్వం మీద తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో పరిస్థితి దారుణంగా ఉందని, “ఏపీలో ప్రభుత్వం ఉందా లేదా?” అని ప్రశ్నించారు.గత ఐదు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా ఇంధన కొరత తీవ్రంగా కొనసాగుతోందని ఆయన పేర్కొన్నారు. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో ఎక్కడా లేని పరిస్థితి కేవలం ఆంధ్రప్రదేశ్లోనే ఎందుకు ఏర్పడిందని ప్రశ్నించారు.ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తరచూ “విజన్” గురించి మాట్లాడుతున్నారని, అయితే ప్రజలు ఎదుర్కొంటున్న ఇంధన సమస్యపై స్పష్టమైన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.ఇంధన కొరత సహజసిద్ధం కాదని, కమీషన్ల కోసం కృత్రిమంగా సృష్టిస్తున్నారని సజ్జల ఆరోపించారు. ఈ వ్యవహారంలో పారదర్శకత లేకపోవడం ప్రజల్లో అనుమానాలు కలిగిస్తోందని అన్నారు.ప్రభుత్వం వెంటనే స్పందించి ఇంధన సరఫరా సమస్యను పరిష్కరించాలని, లేకపోతే ప్రజల ఆగ్రహాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
