మే 15, (నేటి తెలుగు పత్రిక): ఆక్వా రైతుల సమస్యలపై తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజల్లో భయాందోళనలు సృష్టించడం మాజీ ముఖ్యమంత్రి జగన్కు అలవాటైందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు విమర్శించారు. రైతుల సంక్షేమంపై నిజమైన చిత్తశుద్ధి ఉంటే వాస్తవాలు మాట్లాడాలని, రాజకీయ ప్రయోజనాల కోసం అబద్ధాలు ప్రచారం చేయడం బాధ్యతారాహిత్యమని అన్నారు.ఆక్వా ఫీడ్ ధరల పెంపు విషయం తెలిసిన వెంటనే ప్రభుత్వం స్పందించి సంబంధిత కంపెనీలకు నోటీసులు జారీ చేసిందని మంత్రి తెలిపారు. ప్రభుత్వ హెచ్చరికలతో ఫీడ్ కంపెనీలు ధరల పెంపును ఉపసంహరించుకోవడంతో రైతులు ఊరట పొందారని చెప్పారు. ఈ అంశాన్ని రాజకీయంగా మలచడం సరికాదన్నారు.జగన్ పాలనలో విద్యుత్ ఛార్జీలు, డీజిల్ ధరలు, రవాణా వ్యయాలు పెరగడంతో ఆక్వా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. అనేక చెరువులు మూతపడగా, ఎగుమతులు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. గత ప్రభుత్వ విధానాల వల్లే ఆక్వా రంగం నష్టపోయిందని విమర్శించారు.ప్రస్తుత ప్రభుత్వం జోన్, నాన్జోన్ తేడా లేకుండా రైతులకు యూనిట్ విద్యుత్ను రూ.1.50కే అందించేందుకు చర్యలు తీసుకుంటోందని మంత్రి వెల్లడించారు. రైతులకు సులభంగా లైసెన్సులు లభించేలా చర్యలు చేపట్టడంతో పాటు, ఆక్వా రంగ అభివృద్ధికి పలు సంస్కరణలు అమలు చేస్తున్నామని తెలిపారు. రైతుల పేరుతో రాజకీయాలు చేయడం మానుకోవాలని జగన్కు మంత్రి సూచించారు.
