మే 15, (నేటి తెలుగు పత్రిక): కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర సైకిల్పై హాజరయ్యారు. ఇంధన పొదుపు, బాధ్యతాయుత జీవనశైలిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ చర్య చేపట్టినట్లు తెలిపారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దేశం ప్రస్తుతం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్న నేపథ్యంలో ప్రతి పౌరుడు బాధ్యతతో వ్యవహరించాలని అన్నారు. “నా దేశం – నా బాధ్యత” అనే భావనతో ప్రజలంతా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఇంధన వినియోగాన్ని తగ్గించడంతో పాటు వంటనూనె, గ్యాస్ వంటి నిత్యావసరాల వినియోగంలో కూడా పొదుపు పాటించాలని సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ప్రభుత్వ ఖర్చులను తగ్గించే చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు.ప్రజల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంచేందుకు సైకిల్ ప్రయాణాన్ని ప్రోత్సహిస్తున్నామని మంత్రి వెల్లడించారు. ప్రతి ఇంటికి సోలార్ విద్యుత్ కనెక్షన్ ఏర్పాటు చేసుకునేలా ప్రజలు ముందుకు రావాలని కోరారు.దేశాభివృద్ధికి ప్రజల భాగస్వామ్యం అవసరమని, చిన్నచిన్న పొదుపులు కూడా పెద్ద మార్పుకు దారి తీస్తాయని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.
