మే 15, (నేటి తెలుగు పత్రిక): పశ్చిమాసియా ఉద్రిక్త పరిస్థితులు, ఇంధన వినియోగాన్ని తగ్గించాలన్న కేంద్ర ప్రభుత్వ సూచనల నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇకపై ప్రతి సోమవారం, శుక్రవారం అలాగే పాక్షిక పనిదినాల్లో కేసుల విచారణను వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే నిర్వహించాలని నిర్ణయించింది.ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా న్యాయమూర్తులు కార్ పూలింగ్ విధానాన్ని అనుసరించాలని సూచించింది. అలాగే సిబ్బంది రాకపోకల వల్ల అయ్యే ఇంధన వినియోగాన్ని తగ్గించేందుకు రిజిస్ట్రీలోని 50 శాతం ఉద్యోగులకు వారానికి రెండు రోజుల పాటు వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం కల్పించింది.అయితే పనుల అవసరాన్ని బట్టి ఈ విధానంలో మార్పులు చేయడానికి సంబంధిత రిజిస్ట్రార్లకు అధికారాలు ఇచ్చింది. సుప్రీంకోర్టు తీసుకున్న ఈ నిర్ణయాలు ఇంధన సంరక్షణతో పాటు పరిపాలనా సామర్థ్యాన్ని కూడా పెంచుతాయని భావిస్తున్నారు.
