మే 15, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రంలో కాలువల నిర్వహణ పనులు, వెలిగొండ ప్రాజెక్టు పురోగతిపై ఇరిగేషన్ అధికారులతో మంత్రి నిమ్మల రామానాయుడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఖరీఫ్ సీజన్కు ముందే అన్ని ఓఅండ్ఎం పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాలువల మరమ్మతులు, పూడికతీత, తూడు తొలగింపు వంటి పనుల కోసం రెండు విడతల్లో రూ.708 కోట్లు కేటాయించామని మంత్రి తెలిపారు. తాజాగా అత్యవసర నిర్వహణ పనుల కోసం రూ.397 కోట్లు విడుదల చేసినట్లు వెల్లడించారు.కాలువల నిర్వహణను జలధార కార్యక్రమంతో అనుసంధానం చేసి భూగర్భ జలాల స్థాయిని పెంచే దిశగా పనిచేయాలని మంత్రి సూచించారు. ప్రతి వారం పనుల పురోగతి నివేదికలను సమర్పించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.అత్యవసర పనులకు సంబంధించిన టెండర్ ప్రక్రియ వేగవంతం చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక నిర్ణయాలు తీసుకుందని చెప్పారు. రూ.10 లక్షలకు పైబడిన పనులకు కూడా ఏడు రోజుల్లోనే షార్ట్ టెండర్లు పూర్తి చేసే విధంగా కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. ఈ నెలలో జలధార కార్యక్రమంపై కేంద్ర జలశక్తి మంత్రి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష సమావేశం నిర్వహించే అవకాశముందని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు.
