మే 15, (నేటి తెలుగు పత్రిక): శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ప్రారంభమైన ఏఎంసీఏ ప్రాజెక్టుపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పందించారు. రక్షణ, ఏరోస్పేస్, డీప్ టెక్నాలజీ రంగాల్లో ఆంధ్రప్రదేశ్ను శక్తివంతమైన కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా ఈ ప్రాజెక్ట్ కీలక మైలురాయిగా నిలుస్తుందని పేర్కొన్నారు.ఎక్స్ వేదికగా స్పందించిన పవన్ కల్యాణ్.. రూ.15,800 కోట్ల పెట్టుబడితో 650 ఎకరాల్లో ఏర్పాటు కానున్న ఈ ప్రాజెక్ట్ రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధికి కొత్త దిశ చూపుతుందని అన్నారు. ఎయిర్క్రాఫ్ట్ ఇంటిగ్రేషన్, ఫ్లైట్ టెస్టింగ్ సెంటర్తో పాటు రక్షణ, డ్రోన్ ఎకోసిస్టమ్కు సంబంధించిన పలు యూనిట్లు ఇక్కడ ఏర్పాటు కానున్నాయని తెలిపారు.ఈ ప్రాజెక్ట్ ద్వారా 7,500కు పైగా ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉందని పవన్ వెల్లడించారు. సాంకేతిక పురోగతి, స్వదేశీ రక్షణ సామర్థ్యాల పెంపులో ఏపీ కీలక పాత్ర పోషించబోతుందని అభిప్రాయపడ్డారు.ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనలో రాష్ట్రాలకు సహకరిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీకి పవన్ కృతజ్ఞతలు తెలిపారు. అలాగే రక్షణ రంగ ప్రాజెక్టులకు మద్దతు అందిస్తున్న కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్కు ధన్యవాదాలు తెలిపారు.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక వృద్ధి, ఆవిష్కరణలు, భవిష్యత్ పెట్టుబడుల దిశగా వేగంగా ముందుకెళ్తోందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
