మే 19, (నేటి తెలుగు పత్రిక): శాసనసభ, శాసనమండలిలో పనిచేసే అధికారులు మరియు సిబ్బందికి శాసనవ్యవస్థకు సంబంధించిన వివిధ అంశాలపై మూడు రోజుల శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం మంగళవారం నుంచి ప్రారంభం కానుంది. పార్లమెంటరీ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఫర్ డెమోక్రసీస్ (ప్రైడ్) సహకారంతో ఈ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో చట్టాల రూపకల్పన, ప్రైవేట్ సభ్యుల బిల్లులు, తీర్మానాలు, జీరో అవర్, ప్రశ్నోత్తరాలు, అలాగే బడ్జెట్ ప్రక్రియలపై అవగాహన కల్పించనున్నారు.ఈ శిక్షణను అసెంబ్లీ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్ సూర్యదేవర ప్రారంభించనున్నారు. లోక్సభ సచివాలయం ప్రైడ్ డైరెక్టర్ పీకే మల్లిక్తో పాటు సంయుక్త కార్యదర్శులు హెచ్. రామ్ప్రకాశ్, ఎంకే శర్మ, పార్థ గోస్వామి తదితరులు శిక్షణ అందించనున్నారు.
