మే 20, (నేటి తెలుగు పత్రిక): ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. దేశ గౌరవాన్ని మోదీ ప్రభుత్వం దిగజార్చిందని ఆరోపించారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ అమెరికాను ధైర్యంగా ఎదుర్కొన్నారని, కానీ ఇప్పుడు అదానీ కోసం డొనాల్డ్ ట్రంప్కు మోదీ బానిసలా వ్యవహరిస్తున్నారని ట్వీట్ చేశారు. దేశాన్ని మళ్లీ సరైన దిశలో నడిపించగల నాయకత్వం రాహుల్ గాంధీదేనని ఆమె పేర్కొన్నారు. మరోవైపు పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నా టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీలు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడం లేదని విమర్శించారు.ఇంధన ధరల పెరుగుదలతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
