Breaking News

స్త్రీ శక్తి థీమ్‌తో మహానాడు-2026 నిర్వహణకు టీడీపీ సిద్ధం

మే 22, (నేటి తెలుగు పత్రిక): ఎన్. చంద్రబాబు నాయుడు నేతృత్వంలో జరిగిన టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశంలో మహానాడు-2026ను “స్త్రీ శక్తి” థీమ్‌తో నిర్వహించాలని కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 27, 28 తేదీల్లో జరగనున్న మహానాడులో మహిళా సాధికారత, అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని నిర్ణయించారు.ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా ఈ సమావేశాన్ని వర్చువల్ విధానంలో నిర్వహించారు. సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి చంద్రబాబుతో పాటు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ పాల్గొన్నారు. ఇతర పొలిట్ బ్యూరో సభ్యులు వివిధ ప్రాంతాల నుంచి సమావేశానికి హాజరయ్యారు. మహానాడులో మొత్తం 20 తీర్మానాలు ప్రవేశపెట్టాలని సమావేశంలో నిర్ణయించారు. వీటిలో 10 ఆంధ్రప్రదేశ్‌కు, 4 తెలంగాణకు, 1 అండమాన్‌కు సంబంధించిన తీర్మానాలు ఉండగా, మరో 4 ఉమ్మడి తీర్మానాలు మరియు ఒక కీలక రాజకీయ తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. మహిళల సాధికారతకు టీడీపీ ఆవిర్భావం నుంచి తీసుకున్న నిర్ణయాలు, మహిళల కోసం అమలు చేసిన పథకాలు, హక్కుల పరిరక్షణకు చేపట్టిన చర్యలను మహానాడులో వివరించాలని సీఎం సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులపై కూడా విస్తృత చర్చ జరగాలని పేర్కొన్నారు.“మన దేశం-మన బాధ్యత” పేరుతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పొదుపు చర్యలపై ప్రత్యేక చర్చ నిర్వహించాలని చంద్రబాబు సూచించారు. అలాగే రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, కుట్రలు, ప్రజా సమస్యలపై కూడా మహానాడులో చర్చించాలని పొలిట్ బ్యూరో అభిప్రాయపడింది.టీడీపీ వ్యవస్థాపకుడు N. T. Rama Rao సిద్ధాంతాలు, పార్టీ చరిత్రను నేటి తరానికి తెలియజేసేలా ప్రత్యేక ప్రజెంటేషన్లు ఇవ్వాలని నిర్ణయించారు.ఈసారి మహానాడు హైబ్రిడ్ విధానంలో నిర్వహించినప్పటికీ, కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించాలని సీఎం సూచించారు. రెండు రోజుల ముందే ప్రతి ఇంటిపై టీడీపీ జెండా ఎగరేయాలని, పార్టీ అగ్రనేతల నుంచి క్షేత్రస్థాయి కార్యకర్తల వరకు అందరూ మహానాడులో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

ఏపీపీఎస్సీ ద్వారా 106 ఈవో పోస్టుల భర్తీ: మంత్రి ఆనం

బీసీ గురుకుల విద్యార్థులకు స్పోర్ట్స్ కిట్లు, ట్రాక్ సూట్లు అందజేస్తాం: మంత్రి సవిత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *