మే 22, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రంలోని వివిధ దేవాలయాల్లో ఖాళీగా ఉన్న 106 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (ఈవో) పోస్టులను ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ప్రకటించారు. నియామకాలకు సంబంధించి త్వరలో పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు.చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకస్వామి ఆలయంలో నిర్మించిన వినాయక సదన్ వసతి గృహం రెండో, మూడో అంతస్తులను గురువారం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలోని ఆలయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నామని పేర్కొన్నారు. ప్రస్తుతం 52 ఆలయాల్లో అమలవుతున్న అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని త్వరలో 116 ఆలయాలకు విస్తరించేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. టీటీడీ సహకారంతో ‘శ్రీవాణి భజన మందిరాల’ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తామని వెల్లడించారు.గిరిజన తండాలు, దళితవాడల్లో భజన మందిరాల నిర్మాణానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, గ్రామస్థుల అభీష్టం మేరకే దేవతా విగ్రహాల ప్రతిష్ఠాపన జరుగుతుందని చెప్పారు.గత 23 నెలల్లో కామన్ గుడ్ ఫండ్ కింద 691 ఆలయాలకు రూ.812.67 కోట్ల వ్యయంతో జీర్ణోద్ధరణ పనులు చేపట్టినట్లు మంత్రి ఆనం వెల్లడించారు.
