అమరావతి, మే 22, (నేటి తెలుగు పత్రిక): డీలిమిటేషన్ అంశంపై కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం చేసిన వ్యాఖ్యలపై ఏపీ విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ స్పందించారు. ఈ మేరకు ఆయన తన ఎక్స్ ఖాతా ద్వారా స్పష్టమైన కౌంటర్ ఇచ్చారు.భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 81 ప్రకారం 1971 జనగణన ఆధారంగా లోక్సభ సీట్ల కేటాయింపుపై అమల్లో ఉన్న ఫ్రీజ్ 2026 తర్వాత నిర్వహించే జనగణనతో ముగుస్తుందని లోకేశ్ పేర్కొన్నారు. ఆ తర్వాత దేశవ్యాప్తంగా లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన తప్పనిసరి అవుతుందని ఆయన స్పష్టం చేశారు.ఈ ప్రక్రియలో జనాభా పెరుగుదల తేడాల కారణంగా ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాలు పార్లమెంట్లో ప్రాతినిధ్యం కోల్పోయే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. ఇదే అంశాన్ని తమ పార్టీ చాలా కాలంగా ప్రస్తావిస్తోందని గుర్తు చేశారు.డీలిమిటేషన్ బిల్లు ద్వారా అన్ని రాష్ట్రాలకు న్యాయం చేయాలని ఎన్డీయే ప్రభుత్వం ప్రయత్నిస్తోందని పేర్కొన్న లోకేశ్, అయితే ఈ బిల్లును పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ ఎందుకు వ్యతిరేకించిందో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు.2026 జనగణన తర్వాత ఏర్పడే పరిస్థితులపై కాంగ్రెస్ పార్టీ తన వైఖరిని స్పష్టంగా తెలియజేయాలని, దక్షిణాది రాష్ట్రాల రాజకీయ ప్రాతినిధ్యం తగ్గకుండా తీసుకునే చర్యలను వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు.
