మే 22, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హోంగార్డుల కోసం ప్రత్యేక ఆరోగ్య బీమా పథకాన్ని ప్రారంభించింది. విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన హోంగార్డు ఆరోగ్య బీమా సహాయ కేంద్రాన్ని హోం మంత్రి వంగలపూడి అనిత ప్రారంభించారు. దేశంలోనే తొలిసారిగా హోంగార్డులకు ప్రత్యేకంగా ఆరోగ్య బీమా సదుపాయం అందిస్తున్నామని మంత్రి తెలిపారు. మొదటి విడతలో 975 మంది హోంగార్డులకు ఈ పథకం వర్తించనుండగా, మొత్తం 3,140 మంది లబ్ధి పొందే అవకాశం ఉందన్నారు. ఈ బీమా కింద భర్త, భార్యతో పాటు ఇద్దరు పిల్లలకు కూడా కవరేజ్ కల్పించనున్నారు.ప్రతి ఏడాది రూ.3 లక్షల నుంచి రూ.33 లక్షల వరకు ఆరోగ్య బీమా సౌకర్యం అందుబాటులో ఉంటుందని మంత్రి అనిత వెల్లడించారు. హోంగార్డుల నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పూర్తిగా ఉచితంగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు.పోలీసులతో పోలిస్తే హోంగార్డులకు తక్కువ వేతనాలు ఉండటం, ఆరోగ్య భద్రతా సౌకర్యాలు లేకపోవడం వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. విధుల్లో ప్రాణాలు కోల్పోయిన హోంగార్డుల కుటుంబాలకు ఈ బీమా పథకం ఆర్థిక భరోసా కల్పిస్తుందని మంత్రి పేర్కొన్నారు.
