మే 22, (నేటి తెలుగు పత్రిక): పెన్షన్ల విషయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలను తప్పుదోవ పట్టించేలా వ్యాఖ్యలు చేస్తున్నారని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. చంద్రబాబు హయాంలో 6 లక్షల పెన్షన్లు తొలగించారన్న వ్యాఖ్యలు పూర్తిగా అసత్యమని అన్నారు.అమరావతిలో మీడియాతో మాట్లాడిన మంత్రి.. జగన్ ప్రభుత్వ కాలంలోనే లక్షలాది మంది నిరుపేదల పెన్షన్లు రద్దయ్యాయని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరణించిన లబ్ధిదారుల పెన్షన్లు మాత్రమే నిలిపివేశామని స్పష్టం చేశారు.కూటమి ప్రభుత్వం 22 నెలల వ్యవధిలో కొత్తగా 2.50 లక్షల మందికి పెన్షన్లు మంజూరు చేసిందని మంత్రి వెల్లడించారు. మరోవైపు జగన్ పాలనలో ఐదేళ్లలో పెన్షన్ల కోసం రూ.91 వేల కోట్లు ఖర్చు కాగా, ప్రస్తుత ప్రభుత్వం కేవలం 22 నెలల్లోనే రూ.63,157 కోట్లు వ్యయం చేసిందని తెలిపారు.పెన్షన్ల అంశంపై తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కోరారు. ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలుకు కట్టుబడి పనిచేస్తోందని ఆయన పేర్కొన్నారు.
