ముఖ్యమంత్రి చంద్రబాబుకు సిపిఐ నేతల వినతి
మంగళగిరి మే 22 ( నేటి తెలుగు దిన పత్రిక ప్రతినిధి): పెద్దవాగు ప్రాజెక్టును పూర్తి సామర్థ్యంతో పునర్నిర్మించి రైతాంగానికి సాగునీరు, ప్రజలకు త్రాగునీరు అందించేలా చర్యలు చేపట్టాలని సిపిఐ నాయకులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కోరారు.ఈ మేరకు సిపిఐ జాతీయ కార్యదర్శి కె. రామకృష్ణ, జాతీయ కార్యవర్గ సభ్యులు ముప్పాళ్ల నాగేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి జి. ఈశ్వరయ్య గురువారం ముఖ్యమంత్రిని కలిసి వినతి పత్రం సమర్పించారు.1970లో సిపిఐ చేపట్టిన ఉద్యమాల ఫలితంగా 1977లో అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు హయాంలో పెద్దవాగు ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభమైనట్లు నేతలు పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు పరిధిలో సుమారు 16 వేల ఎకరాల ఆయకట్టు ఉందని తెలిపారు. రాష్ట్ర విభజన అనంతరం వేలేరుపాడు, కుక్కునూరు మండలాలు ఆంధ్రప్రదేశ్లో విలీనం కాగా, ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతం తెలంగాణలో ఉండటంతో నిర్వహణలో సమస్యలు తలెత్తినట్లు వివరించారు. నిర్వహణ నిధుల కొరత కారణంగా గేట్ల మరమ్మతులు సకాలంలో చేపట్టకపోవడంతో 2024 జూలై 18న భారీ వరదల సమయంలో ప్రాజెక్టుపై నుంచి వరదనీరు ప్రవహించి గట్టుకు గండ్లు పడటంతో పాటు గేట్లు పూర్తిగా దెబ్బతిన్నాయని తెలిపారు. దీంతో గిరిజన రైతాంగం సాగునీటి లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోందని ఆవేదన వ్యక్తం చేశారు.ఆయకట్టులో 85 శాతం భాగం ఆంధ్రప్రదేశ్ పరిధిలో ఉండటంతో ఆ మేరకు నిధులు కేటాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాలని, మిగిలిన 15 శాతం నిధులను తెలంగాణ ప్రభుత్వం కేటాయించేందుకు అంగీకరించినట్లు తెలిపారు. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రూ.500 కోట్లతో ప్రాజెక్టును పునర్నిర్మించాలని విజ్ఞప్తి చేశారు.ఈ సందర్భంగా తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గతంలో ఈ అంశంపై తనతో మాట్లాడినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారని, ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ అధికారులతో చర్చించి తగిన పరిష్కారం కనుగొంటామని హామీ ఇచ్చినట్లు సిపిఐ నేతలు వెల్లడించారు.
