పచ్చదనం మధ్య ప్రజలకు కొత్త అనుభూతిని అందిస్తున్న ఎస్ఎల్ఎన్ పార్క్
పిల్లలకు ఆట స్థలం.. వృద్ధులకు విశ్రాంతి కేంద్రంగా ఎస్ఎల్ఎన్ పార్క్
మంగళగిరి మే 22 ( నేటి తెలుగు దిన పత్రిక ప్రతినిధి): మంగళగిరి పట్టణ ప్రజలకు మరింత మెరుగైన జీవన వాతావరణాన్ని అందించాలనే లక్ష్యంతో మంత్రి నారా లోకేష్ చొరవతో ఎస్ఎల్ఎన్ కాలనీలోని శ్రీలక్ష్మీ నరసింహస్వామి పార్క్ను ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేశారు. ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం, పిల్లలకు వినోదభరితమైన ఆట స్థలం, వృద్ధులకు ప్రశాంతమైన విశ్రాంతి వేదికగా ఈ పార్క్ రూపుదిద్దుకుంది.సుమారు 0.35 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ పార్క్ను రూ.1.06 కోట్ల వ్యయంతో అందంగా తీర్చిదిద్దారు. పార్కులో విశాలమైన వాకింగ్ ట్రాక్లు, పచ్చని మొక్కలు, అలంకార వృక్షాలు, పిల్లల కోసం ఆధునిక ఆట పరికరాలు, కూర్చునేందుకు బెంచీలు, సుందరమైన లైటింగ్ ఏర్పాటు చేశారు. ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రజలు నడక, వ్యాయామం చేసుకునేలా ప్రత్యేక సౌకర్యాలు కల్పించారు.పట్టణంలో వేగంగా పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ప్రజలకు విశ్రాంతి, వినోదం కలిగించే ప్రదేశాలు అవసరమనే దృష్టితో ఈ పార్క్ను అభివృద్ధి చేసినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. “అభివృద్ధి అంటే కేవలం రోడ్లు, భవనాలు మాత్రమే కాదు… ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే ఆహ్లాదకర వాతావరణం కూడా” అనే ఆలోచనతో మంగళగిరిలో పలు అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు.ఈ పార్క్ అభివృద్ధితో ఎస్ఎల్ఎన్ కాలనీ పరిసర ప్రాంతాల ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణం లభించడంతో పాటు, కుటుంబ సమేతంగా గడిపే అందమైన ప్రదేశంగా మారిందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
