మే 24, (నేటి తెలుగు పత్రిక): విజయవాడలో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర, టెలివిజన్, నాటక అభివృద్ధి సంస్థ కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధిపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.ఆంధ్రప్రదేశ్లో సినీ పరిశ్రమ అభివృద్ధికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహకారం అందిస్తున్నారని బాలకృష్ణ తెలిపారు. రాష్ట్ర విభజన తర్వాత కూడా చిత్ర పరిశ్రమను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందన్నారు.విజయవాడ భవిష్యత్తులో తెలుగు సినీ రంగానికి కీలక కేంద్రంగా మారే అవకాశాలు ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. తెలుగు సినిమాలకు వచ్చే వసూళ్లలో పెద్ద భాగం ఆంధ్రప్రదేశ్ నుంచే వస్తోందని పేర్కొన్నారు. రాజమండ్రి, అరకు, విశాఖపట్నం వంటి ప్రాంతాల్లో ఇప్పటికే అనేక చిత్రాల షూటింగ్లు జరుగుతున్నాయని చెప్పారు.ఆంధ్రప్రదేశ్లో సినిమా చిత్రీకరణలకు అనువైన ప్రకృతి అందాలు, నదులు, అడవులు, జలపాతాలు, గ్రామీణ ప్రాంతాలు సమృద్ధిగా ఉన్నాయని బాలకృష్ణ తెలిపారు. షూటింగ్లకు అవసరమైన అనుమతులను సింగిల్ విండో విధానంలో అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.సినిమా రంగం ప్రస్తుతం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటోందని బాలకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. థియేటర్ల పరిస్థితి దయనీయంగా మారిందని, మంచి సినిమాలు ఎక్కువగా రావాల్సిన అవసరం ఉందన్నారు. సందేశాత్మక చిత్రాలకు తాను ఎప్పుడూ ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం కూడా సినీ పరిశ్రమకు సహకారం అందించాలని బాలకృష్ణ కోరారు. హైదరాబాద్ ఇప్పటికే తెలుగు సినీ పరిశ్రమకు ప్రధాన కేంద్రంగా ఉందని, అదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో కూడా మరిన్ని షూటింగ్లు జరిగేలా ప్రోత్సహిస్తామని తెలిపారు.త్వరలోనే నంది అవార్డులు, నంది నాటకోత్సవాలను నిర్వహిస్తామని ప్రకటించిన బాలకృష్ణ.. తెలుగు సినిమా అభివృద్ధికి అందరూ సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
