మే 25, (నేటి తెలుగు పత్రిక): విజయవాడలో పెట్రోల్ బంక్ యజమానులు ఆయిల్ కంపెనీల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ధరలు పెరగనున్నాయనే సమాచారం రావడంతో ముందుగానే పెట్రోల్, డీజిల్ కోసం ఆర్డర్లు ఇచ్చినా.. గత నాలుగు రోజులుగా సరఫరా నిలిపివేశారని ఆరోపిస్తున్నారు.దీంతో ఇప్పుడు పెరిగిన ధరలకే ఇంధనం కొనుగోలు చేయాల్సి వస్తోందని, దీనివల్ల భారీ నష్టం ఎదురవుతోందని బంక్ నిర్వాహకులు వాపోతున్నారు. ఆయిల్ కంపెనీలు కావాలనే ఆలస్యం చేశాయని ఆరోపిస్తూ, ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు విచారణ జరిపించాలని కోరుతున్నారు.ఇక దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా నాలుగోసారి పెరిగాయి. హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర రూ.115.69కు, డీజిల్ ధర రూ.103.82కు చేరగా.. విజయవాడలో పెట్రోల్ రూ.117.75, డీజిల్ రూ.105.43గా నమోదైంది.
