అమరావతి, మే 25, (నేటి తెలుగు పత్రిక): ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యాఖ్యల వివాదంపై జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరోక్షంగా స్పందించారు. జనసేన పార్టీపై, తనపై ఇష్టానుసారంగా విమర్శలు చేస్తే ఇక సహించబోనని హెచ్చరించారు. “దారినపోయేవాళ్లు జనసేనపై రాళ్లు వేస్తామంటే ఊరుకోను. ఇప్పటివరకు అన్నీ భరించా.. ఇక ఓపిక లేదు” అంటూ పవన్ కళ్యాణ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విశ్లేషకులను ప్రశ్నిస్తే వెంటనే కుల రాజకీయాలు తెరపైకి తీసుకురావడం సరైంది కాదని అన్నారు. “ఎవరైనా ఇష్టానుసారం మాట్లాడితే చేతులు కట్టుకుని కూర్చోవాలా? మాకు కోపం రాదా?” అని ప్రశ్నించారు.అధిక సహనం కొన్నిసార్లు చేతగానితనంగా మారుతుందని వ్యాఖ్యానించిన పవన్.. “కర్మ ఎవరినీ వదిలిపెట్టదు” అంటూ హెచ్చరికలు జారీ చేశారు.ఇటీవల ప్రొ. నాగేశ్వర్ చేసిన వ్యాఖ్యలపై జనసేన శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో పవన్ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
