అమరావతి, మే 25, (నేటి తెలుగు పత్రిక): ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యాఖ్యల వివాదం నేపథ్యంలో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ అంతర్గత వ్యవహారాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. “శత్రువులు ఎక్కడో లేరు.. మన పార్టీలోనే ఉన్నారు” అంటూ పవన్ వ్యాఖ్యానించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో జరిగిన సమావేశంలో మాట్లాడిన విషయాలు బయటకు ఎలా వచ్చాయని ప్రశ్నించారు.“వైసీపీ నాయకుడు జైలుకెళ్లాలని నేను ఎందుకు కోరుకుంటాను? అలా అయితే జనసేన ఎదుగుతుందా?” అని పవన్ ప్రశ్నించారు. అలాంటి విషయాలు కేంద్ర హోంమంత్రితో చర్చిస్తామనడం పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు.ఇలాంటి ఆరోపణలు చేయడం ద్వారా వ్యవస్థను అవమానపరుస్తున్నారని మండిపడ్డారు. తాను అమిత్ షాను కలిసింది పూర్తిగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, రాష్ట్ర ప్రయోజనాల కోసమేనని పవన్ కళ్యాణ్ తెలిపారు.ఇటీవల తనపై వస్తున్న రాజకీయ విమర్శలు, విశ్లేషణలపై పవన్ వరుసగా ఘాటుగా స్పందించడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
