జూన్ 01, (నేటి తెలుగు పత్రిక): లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సీబీఎస్ఈ ఆన్స్క్రీన్ మార్కింగ్ వ్యవస్థలో తలెత్తిన సమస్యలపై కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. ఇది కేవలం నిర్లక్ష్యం కాదని, వ్యవస్థలో జరిగిన కుమ్మక్కు ఫలితమని ఆరోపించారు.
ప్రధాని నరేంద్ర మోదీ తన రేడియో కార్యక్రమంలో వివిధ అంశాలపై మాట్లాడుతున్నప్పటికీ, లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన సమస్యపై స్పందించకపోవడం బాధాకరమని రాహుల్ పేర్కొన్నారు. సుమారు 18.5 లక్షల మంది విద్యార్థులను ప్రభావితం చేసే అంశంపై కేంద్రం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
సీబీఎస్ఈ టెండర్ నిబంధనల్లో మార్పులు చేయడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని ఆయన ఆరోపించారు. నిబంధనల ప్రకారం అధిక నాణ్యత గల 300 DPI ఆటోమేటెడ్ స్కానింగ్ వ్యవస్థను ఉపయోగించాల్సి ఉండగా, కొన్ని చోట్ల మొబైల్ ఫోన్లతో పరీక్ష పత్రాలను స్కాన్ చేసినట్లు పేర్కొన్నారు.
విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడిన అంశాల్లో పారదర్శకత, నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని రాహుల్ గాంధీ అన్నారు. ఈ వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
