పులివెందుల ఫిబ్రవరి 18 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శ్రీమాన్ జిష్ణు దేవ్ వర్మ తెలంగాణ రాజ్ భవన్లో తవాస్మి హిందీ సంచికను అధికారికంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం తవాస్మి ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది. ఈ సందర్భంగా తవాస్మి రచయిత శ్రీరామ చక్రధర్ గారు మాట్లాడుతూ, గ్రంథాన్ని హిందీలోకి అనువదించిన శ్రీ స్వామి ఉరుక్రమానంద గారికి, భాషా సరళీకరణలో సహకరించిన పి. శివ మునెమ్మ (విశ్రాంత ప్రధానోపాధ్యాయురాలు )కి కృతజ్ఞతలు తెలిపారు. ఇంతటి బృహత్ గ్రంథాన్ని అద్భుతంగా డిజైన్ చేసి, ప్రింటింగ్ దశ వరకు తీసుకువచ్చిన తవాస్మి సభ్యులు శారద దీప్తి, జాహ్నవి రెడ్డి, , అలాగే ఈ ఆవిష్కరణ విజయవంతం కావడానికి సహకరించిన రితిక చక్రవర్తిలకు కృతజ్ఞతలు తెలియజేశారు. గవర్నర్ తవాస్మిని నేటి యువతకు అత్యంత అవసరమైన విలువల ఆధారిత విద్యా కార్యక్రమంగా అభివర్ణించి, ఈ విలువలు దేశవ్యాప్తంగా పాఠశాల విద్యలో భాగం కావాలని తన ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఈ ఆవిష్కరణతో తవాస్మి ఇప్పుడు ఇంగ్లీష్, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో అందుబాటులోకి వచ్చింది. రామాయణంలోని శాశ్వత విలువలను భావితరాలకు చేరవేయాలనే తవాస్మి ప్రయత్నంలో ఇది ఒక గొప్ప ముందడుగు. రామాయణంలోని జీవన విలువలను ప్రతి విద్యార్థికి, ప్రతి కుటుంబానికి, ప్రతి సమాజానికి చేరవేయాలనే ఈ యాత్రలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని తవాస్మి బృందం ఆకాంక్షించింది.
