మే 16, (నేటి తెలుగు పత్రిక): ఏపీలో ఆర్టీసీ ఆధ్వర్యంలో ప్రత్యేక టూరిజం సేవలు త్వరలో ప్రారంభం కానున్నాయి. సీఎం చంద్రబాబు సూచనల మేరకు పర్యాటక అభివృద్ధి సంస్థ తరహాలో ఈ సేవలను అందుబాటులోకి తీసుకురావడానికి అధికారులు సన్నాహాలు వేగవంతం చేశారు.తిరుపతి కేంద్రంగా ప్రముఖ దేవాలయాలు, పర్యాటక ప్రాంతాలు, బీచ్లు, హెరిటేజ్ ప్రాంతాలను కలుపుతూ ప్రత్యేక టూర్ ప్యాకేజీలకు రూపకల్పన చేస్తున్నారు. రిలీజియస్, ఎకో, హెరిటేజ్ టూరిజం విభాగాలుగా సేవలను విభజించనున్నారు. గండికోట, ఒంటిమిట్ట, శ్రీకాళహస్తి, పులికాట్ సరస్సు, తూపిలిపాళెం బీచ్, చంద్రగిరి కోట వంటి ప్రదేశాలను ఈ టూరిజం మార్గాల్లో చేర్చే ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ప్రయాణికుల కోసం ప్రత్యేక బస్సులు, టికెట్ బుకింగ్ సౌకర్యాలు, సూచిక బోర్డులు ఏర్పాటు చేయనున్నారు.
