మే 16, (నేటి తెలుగు పత్రిక): డప్పు కళాకారుల ప్రదర్శన ద్వారా దళితుల ఆత్మగౌరవాన్ని చాటే వినూత్న కార్యక్రమానికి బీజేపీ శ్రీకారం చుట్టిందని రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తెలిపారు. విజయవాడలో అంబేద్కర్ విగ్రహం సాక్షిగా డప్పు కళాకారులతో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ కార్యక్రమం సరికొత్త చరిత్రకు నాంది పలుకుతుందని అభిప్రాయపడ్డారు.డప్పు వాయిద్యం కేవలం కళ మాత్రమే కాకుండా ఆధ్యాత్మిక, సాంస్కృతిక, సామాజిక చైతన్యానికి ప్రతీకగా నిలుస్తుందని మాధవ్ అన్నారు. డప్పు కళాకారుల జీవితాలకు గుర్తింపు, గౌరవం తీసుకురావడమే ఈ కార్యక్రమం లక్ష్యమని చెప్పారు. బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో ఈ ప్రదర్శన ఏర్పాటు చేయబడిందని వెల్లడించారు.అంబేద్కర్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. విజయవాడలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహం కేంద్ర ప్రభుత్వ సహకారంతోనే నిర్మించబడిందని మాధవ్ పేర్కొన్నారు. అంబేద్కర్ “చదవండి, సమీకరించండి, పోరాడండి” అన్న సందేశం నేటి తరానికి మార్గదర్శకమని అన్నారు.ఈ కార్యక్రమంలో మంత్రి సత్యకుమార్ సహా కూటమి నేతలు పాల్గొననున్నారని తెలిపారు. డప్పు కళాకారులకు ఆర్థికంగా చేయూత అందించడంతో పాటు అన్ని వర్గాలకు ఆలయాలు మరియు సాంస్కృతిక వేదికల్లో సమాన ప్రాధాన్యం ఇవ్వాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని పీవీఎన్ మాధవ్ పేర్కొన్నారు.
