మే 16, (నేటి తెలుగు పత్రిక): పరిశుభ్రమైన పరిసరాల ద్వారానే ఆరోగ్యకరమైన సమాజం సాధ్యమని రాష్ట్ర మంత్రి సవిత తెలిపారు. పెనుకొండ పట్టణంలో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ఆమె, స్వచ్ఛతపై ప్రజలకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో భాగంగా ఇంధన పొదుపు సందేశాన్ని ఇవ్వడానికి మంత్రి సవిత తన ఇంటి నుంచి నడుచుకుంటూ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రతి ఒక్కరూ తమ వీధులు, కాలనీలు పరిశుభ్రంగా ఉంచాలని పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ కవర్ల వినియోగాన్ని తగ్గించాలని ప్రజలకు సూచిస్తూ, షాపుల్లో కూడా ప్లాస్టిక్ వినియోగాన్ని నివారించాలని వ్యాపారులకు విజ్ఞప్తి చేశారు.చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా బాధ్యతగా వ్యవహరించాలని ఆమె కోరారు. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమం ద్వారా గ్రామాలు, పట్టణాలు మరింత పరిశుభ్రంగా, అందంగా మారతాయని మంత్రి సవిత ఆశాభావం వ్యక్తం చేశారు.
