మే 16, (నేటి తెలుగు పత్రిక): కాకినాడ రూరల్ మండలంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రోడ్డు దాటుతున్న ఉపాధి హామీ మహిళా శ్రామికులను టిప్పర్ ఢీకొట్టడంతో నలుగురు మృతి చెందడం బాధాకరమని ఆయన పేర్కొన్నారు.మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన పవన్ కళ్యాణ్, బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కాకినాడ జిల్లా అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.మృతి చెందిన శ్రామికుల కుటుంబాలకు కూటమి ప్రభుత్వం ప్రకటించిన రూ.4 లక్షల పరిహారం త్వరితగతిన అందజేస్తామని చెప్పారు. అదనంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.2 లక్షల సహాయం, అలాగే పీఎం సురక్ష యోజన, పీఎం జీవన్ జ్యోతి యోజన కింద బీమా ప్రయోజనాలు కూడా అందుతాయని వెల్లడించారు.ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ఉపాధి పనులు జరుగుతున్న ప్రాంతాల్లో భద్రతా చర్యలు కట్టుదిట్టం చేయాలని పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. జాతీయ రహదారులు, బైపాస్ రోడ్లు, ట్రాఫిక్ అధికంగా ఉండే ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి వాహనాల వేగాన్ని నియంత్రించాలని సూచించారు.
