మే 16, (నేటి తెలుగు పత్రిక): ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పొదుపు పిలుపు నేపథ్యంలో టీడీపీ మహానాడు కార్యక్రమాన్ని ఈసారి ఆన్లైన్లో నిర్వహించాలని పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయించినట్లు మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. నెల్లూరులో జరగాల్సిన మహానాడును మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి నిర్వహించనున్నట్లు వెల్లడించారు.పోలిట్బ్యూరో సభ్యులు, ముఖ్య నేతల సమక్షంలో మహానాడు నిర్వహించబడుతుందని, రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో క్లస్టర్ వారీగా భారీ స్క్రీన్లు ఏర్పాటు చేసి కార్యకర్తలకు ప్రత్యక్ష ప్రసారం చూపించనున్నట్లు చెప్పారు.యుద్ధ ప్రభావంతో దేశవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని మంత్రి తెలిపారు. మహానాడు ద్వారా పార్టీ భవిష్యత్ కార్యాచరణ, కీలక నిర్ణయాలను కార్యకర్తలకు చేరవేస్తామన్నారు.ఇదే సమయంలో నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలపై కూడా ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని కొల్లు రవీంద్ర చెప్పారు. కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు సరుకులు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక మానిటరింగ్ కొనసాగుతోందని వెల్లడించారు.
