మే 17, (నేటి తెలుగు పత్రిక): నెదర్లాండ్స్ పర్యటనలో ఉన్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రవాస భారతీయులతో సమావేశమై దేశ అభివృద్ధి, ప్రపంచ పరిస్థితులు, ద్వైపాక్షిక సంబంధాలపై మాట్లాడారు.సభకు హాజరైన భారతీయులు ఘన స్వాగతం పలకడంతో ఆనందం వ్యక్తం చేసిన ప్రధాని, విదేశాల్లో భారతీయులు కష్టపడి పనిచేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారని అన్నారు. నెదర్లాండ్స్ ఆర్థిక వ్యవస్థలో భారతీయుల పాత్ర విశేషమని కొనియాడారు.విదేశాల్లో నివసిస్తున్నప్పటికీ భారతీయ కుటుంబాలు తమ భాష, సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకుంటున్న తీరు గర్వకారణమని పేర్కొన్నారు. భారతీయ పండుగలు, కుటుంబ విలువలను కొత్త తరాలకు అందిస్తున్నారని అభినందించారు.ప్రపంచవ్యాప్తంగా కరోనా ప్రభావం, యుద్ధాలు, ఇంధన సమస్యలు వంటి సవాళ్లు పెరుగుతున్నాయని ప్రధాని తెలిపారు. ఈ పరిస్థితులు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే అవకాశముందని హెచ్చరించారు. ఇలాంటి సమయంలో దేశాల మధ్య బలమైన భాగస్వామ్యం అవసరమని, భారత్ మరియు నెదర్లాండ్స్ కలిసి నమ్మకమైన సరఫరా వ్యవస్థల కోసం పనిచేస్తున్నాయని చెప్పారు.భారత్ ఆధునిక సాంకేతిక రంగంలో వేగంగా ఎదుగుతోందని, ముఖ్యంగా డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతోందని ప్రధాని పేర్కొన్నారు. అభివృద్ధి మరియు మానవీయ విలువలను సమానంగా కాపాడుకుంటూ భారత్ ముందుకు సాగుతోందని అన్నారు.
