మే 17, (నేటి తెలుగు పత్రిక): దేశవ్యాప్తంగా సంచలనం రేపిన నీట్ యూజీ 2026 ప్రశ్నపత్రం లీక్ కేసులో సీబీఐ దర్యాప్తు వేగం పెంచింది. ఈ కేసులో కీలక పరిణామంగా పుణెకు చెందిన బోటనీ అధ్యాపకురాలు మనీషా గురునాథ్ మాంధరేను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు.సీబీఐ వివరాల ప్రకారం.. ఆమె పుణెలోని మోడ్రన్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్, సైన్స్ అండ్ కామర్స్లో సీనియర్ బోటనీ లెక్చరర్గా పనిచేస్తున్నారు. అలాగే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో సబ్జెక్ట్ నిపుణురాలిగా కూడా బాధ్యతలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ఈ హోదాను ఉపయోగించి నీట్ యూజీ పరీక్షకు సంబంధించిన బోటనీ, జువాలజీ ప్రశ్నపత్రాలపై ముందస్తు సమాచారం పొందినట్లు అనుమానిస్తున్నారు. దర్యాప్తులో భాగంగా సీబీఐ సేకరించిన ఆధారాల ప్రకారం.. మే 3న జరిగిన నీట్ యూజీ 2026 పరీక్షకు ముందే కొందరు అభ్యర్థులకు ప్రశ్నలు చేరినట్లు తెలుస్తోంది. మరో నిందితురాలు మనీషా వాఘ్మారే సహకారంతో విద్యార్థులను ఎంపిక చేసి రహస్యంగా శిక్షణ ఇచ్చినట్లు విచారణలో తేలింది.పుణెలోని నివాసంలో నిర్వహించిన ప్రత్యేక కోచింగ్ సెషన్లలో పరీక్షకు సంబంధించిన ముఖ్య ప్రశ్నలను విద్యార్థులతో నోట్బుక్స్లో రాయించారని అధికారులు ఆరోపిస్తున్నారు. కొన్ని పాఠ్యపుస్తకాలలో ముఖ్య ప్రశ్నలకు ప్రత్యేక గుర్తులు పెట్టి అవే పరీక్షలో వచ్చేలా సూచనలు ఇచ్చినట్లు సమాచారం.ఇప్పటివరకు ఈ కేసులో తొమ్మిది మందిని సీబీఐ అదుపులోకి తీసుకుంది. వీరిలో కోచింగ్ నిర్వాహకులు, మధ్యవర్తులు, పరీక్షా వ్యవస్థకు సంబంధిత వ్యక్తులు ఉన్నట్లు తెలుస్తోంది. భారీ మొత్తంలో డబ్బుల లావాదేవీలు జరిగిన అనుమానాలతో బ్యాంక్ ఖాతాలు, మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, చాట్ హిస్టరీలను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపారు.ఈ ఘటనతో దేశవ్యాప్తంగా విద్యార్థులు, తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. లక్షలాది మంది విద్యార్థులు కష్టపడి సిద్ధమవుతుంటే.. కొందరు అక్రమ మార్గాల్లో ప్రశ్నపత్రాలు పొందడం వల్ల నిజాయితీగా పరీక్ష రాసిన వారికి అన్యాయం జరుగుతోందని విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి.ఇప్పటికే నీట్ యూజీ 2026 పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ రద్దు చేసిన నేపథ్యంలో.. మళ్లీ పరీక్ష నిర్వహణపై త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశముంది. మరిన్ని అరెస్టులు కూడా జరిగే అవకాశం ఉందని సీబీఐ వర్గాలు చెబుతున్నాయి.
